ఈ వారంలో రెండు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో జైలర్ ఒకటి కాగా.. మరొకటి భోళా శంకర్. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని.. అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంది.
మరోవైపు చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `భోళా శంకర్` నేడే విడుదల అయింది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా గొప్పగా ఉందని ఒక్కరూ కూడా చెప్పట్లేదు. యావరేజ్ అని కొందరు.. మరో ఆచార్య అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే.. ఈ రెండు సినిమాలకు ఓటీటీ పార్ట్నర్స్ లాక్ అయ్యాయి. జైలర్ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు 200కోట్ల బడ్జెట్తో నిర్మించింది. దీంతో తమ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన సన్నెక్ట్స్ ద్వారానే జైలర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు భోళా శంకర్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లో విడుదలైన ఐదు లేదా ఆరు వారాల తరువాత ఈ రెండు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అంటే ఈ లెక్కన సెప్టెంబర్ చివర్లో జైలర్, భోళా శంకర్ స్ట్రీమింగ్ కానున్నట్లుగా చెబుతున్నారు.