పోసాని కృష్ణమురళి శ్రమ ఫలించింది… కీలక పదవిని ప్రకటించిన జగన్ ప్రభుత్వం!

పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగునాట పోసానికి మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పుకోవాలి. తెలుగు సినిమా రంగంలో మొదట రచయితగా వెలుగొందిన పోసాని, ఆ తరువాత దర్శకుడిగానూ పేరుపొందారు. ఈ క్రమంలో ఆయనికి నటుడిగా పలు అవకాశాలు రావడంతో బిజీ అయిపోయారు. దాంతో కలానికి కాస్త విరామం ప్రకటించారు. కాగా పోసాని 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. అలాగే అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

ఇకపోతే 2009లో ప్రజారాజ్యం తరపున చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసి, ఓడిపోయిన సంగతి తెలిసినదే. రాజకీయాలంటే పోసానికి ఒకింత ఆసక్తి. సినిమాలో ఎదటి వ్యక్తి పేరేదైనా, రాజా అంటూ సంబోధించే ఒక మేనరిజమును ఈయన సినిమాల్లోని వాడిన మాదిరి ఎప్పటికైనా రాజుని కావాలని అనుకున్నాడేమో గాని పోసాని అనుకున్నది సాధించాడు. అవును, వైసీపీ సానుభూతిపరుడు అయినటువంటి పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కీలకపదవిని ముట్ట జెప్పింది జగన్ ప్రభుత్వం.

ఇకపోతే, జగన్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఇంకో వైసీపీ సానుభూతిపరుడు అయినటువంటి సినీ నటుడు, కమెడియన్ ఆలీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇపుడు తాజాగా పోసాని కృష్ణమురళికి మరో కీలకపదవిని ముట్ట జెప్పడం విశేషం. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నాడు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేశారు పోసాని.