ఎన్నో ఆశలతో, మంత్రి హామీతో వైసీపీ నుంచి సైకిలెక్కిన ఎమ్మెల్యే పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా మారిపోయిందట. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన పేరు పరిగనణలోకి కూడా తీసుకోకపోవడంతో ఇప్పటికే ఆయన అసంతృప్తిలో ఉన్నారట. పార్టీలో చేరే సమయంలో సీఎం చంద్రబాబు.. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా చివరి నిమిషంలో పట్టించుకోలేదట. ఇప్పుడు దీనికి తోడు.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు కూడా దక్కే అవకాశాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారట కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా!!
2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా చాంద్ బాషా పోటీచేశారు. కష్టాల్లో ఉన్నానంటూ జగన్ నుంచి రూ.50 లక్షలు ఆర్థిక సాయం పొంది.. ఎన్నికల్లో గెలిచారు. అనంతరం టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు ఆ పార్టీలో చేరిపోయారు. అయితే అందుకు టీడీపీలో తగిన శాస్తి జరిగిందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అక్కడ రెండిటికీ చెడ్డ రేవడిలా మిగిలాడని వైకాపా కార్యవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ముఖ్యంగా కదిరి వైకాపా కార్యకర్తలంతా అతడిపై గుర్రుమీద ఉన్నారుట. వైకాపా తరపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరిన చాంద్ బాషాకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు వచ్చే సీనే కనిపించడం లేదని మాట్లాడుకుంటున్నారు.
మొన్నటికి మొన్న కేబినెట్ విస్తరణలో మైనారిటీ కోటాలో తనకి మంత్రి పదవి దక్కుతుందని ఆశిస్తే అది తీరని కలగా మిగిలిపోయింది. చాంద్ బాషాకు ఉన్న ఒకే ఒక్క దారి ఏమంటే నియోజకవర్గ తేదేపా ఇన్ఛార్జ్గా ఉన్న కందికుంట వెంకటప్రసాద్ కొన్ని కేసుల్లో దోషిగా బుక్కయ్యాడు. అయితే ఇంకా రెండేళ్లు సమయం ఉండటంతో ఈ కేసుల్లో నుంచి బయటపడటం ఏమంత కష్టం కాదని తెలుస్తోంది. ఒకవేళ ఆయనపై ఉన్న కేసులు తొలిగిపోతే ఇక ఆయనకే కదిరి టికెట్టు దక్కచ్చు. దీంతో బాషాకు చుక్కెదురు కావొచ్చు! మరి ఆయన ఎక్కడినుంచైనా పోటీచేస్తారో లేక.. ఏ నిర్ణయి తీసుకుంటారో ఇప్పటికి తెలిసే అవకాశాలు లేవు!