ప‌వ‌న్ `వ‌కీల్ సాబ్‌`కు పోలీసులు బిగ్‌ షాక్‌..నిరాశ‌లో ఫ్యాన్స్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది.

దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వ‌కీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్‌ 3వ తేదీన యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని చిత్ర యూనిట్ భావించింది. అయితే తాజాగా జూబ్లీహిల్స్‌ పోలీసులు వ‌కీల్ సాబ్ యూనిట్‌కు బిగ్ షాక్ ఇచ్చారు.

తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి కోరుతూ జె.మీడియా జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ రాసింది. కానీ, ఈ ఈవెంట్‌కు జూబ్లీహిల్స్‌ పోలీసులు అనుమతి నిరాకరించారు. రాష్ట్రంలో కరోనా మళ్లీ చెలరేగుతున్న నేపథ్యంలో సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌లో మునిగిపోయారు.‌