ఆ పార్టీల్లో వారికి గుర్తింపు తక్కువేనా….!

తెలుగుదేశం పార్టీ అంటే.. అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే కులం కమ్మ. వాస్తవానికి ఏపీలో ఒక్కొ పార్టీనీ ఒక్కో కులం సొంతం చేసుకుందనటంలో సందేహం లేదు. టీడీపీని చౌదరీలు, జనసేనను కాపులు, వైసీపీని రెడ్డి సామాజిక వర్గం సొంతం చేసుకుంది. ఈ పార్టీ మాది అని గొప్పగా ప్రకటించుకుంటున్నారు కూడా. అయితే ఇప్పుడు ఆయా పార్టీలకు సొంత సామాజిక వర్గాలే దూరమవుతున్నాయనటంలో సందేహమే లేదు. ఇంకా చెప్పాలంటే.. అధినేతలే ఆయా వర్గాలను నిర్లక్ష్యం చేయడం వల్ల కొందరు నేతలు దూరమవుతున్నారనేది వాస్తవం.

ఏపీలో 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రెడ్డి సామాజిక వర్గం. వైఎస్ జగన్ ‌మోహన్ రెడ్డిని మా వాడే అని రెడ్డి సామాజిక వర్గం భావించింది. రెడ్డి వర్గం మొత్తం కూడా ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు ఎంతో కష్టపడ్డారు. అయితే జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ.. వ్యాఖ్యలు చేశారు. అలాగే 50 శాతం పదవులు బీసీలకే కేటాయించారు. దీనితో రెడ్డి సామాజిక వర్గానికి సింహభాగం పదవులిచ్చినా సరే.. అది పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి రెడ్డి సామాజిక వర్గమే కారణమైంది. అందుకే రాయలసీమలో కేవలం 7 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. ఇందుకు ప్రధాన కారణం రెడ్డి సామాజిక వర్గానికి జగన్ సరైన గుర్తింపు ఇవ్వలేదనే ఆరోపణలు.

ప్రస్తుతం టీడీపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ కాస్త తేడా కనిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలకు మాత్రం ఎలాంటి గుర్తింపు లేదంటున్నారు విశ్లేషకులు. టీడీపీలో కమ్మ మహిళలు వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది మాత్రమే ఉన్నారనేది బహిరంగ రహస్యం. తొలి నుంచి టీడీపీలో కీలక పదవులన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకే వస్తున్నాయి తప్ప… కమ్మ సామాజిక వర్గానికి మాత్రం రాలేదు. తెలుగు మహిళ, అసెంబ్లీ స్పీకర్, మంత్రి పదవులు, ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి కీలక పదవులన్నీ కూడా కమ్మ మహిళలకు కాకుండా… ఇతరులకే ఎక్కువగా వచ్చాయనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. టీడీపీలో అటు ఉత్తరాంధ్ర మొదలు.. ఇటు అనంతపురం జిల్లా వరకు కమ్మ మహిళల్లో పదవులు దక్కించుకున్న వారు కేవలం ముగ్గురే. మాజీ మంత్రి పరిటాల సునీత, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ గద్దె అనురాధ, దర్శి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మి మాత్రమే. మిగిలిన వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. మంత్రులు గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ కోటాలో, వంగలపూడి అనిత ఎస్సీ కోటాలో మంత్రులు. పెనుగొండ నుంచి ఎన్నికైన సవిత… రెడ్డి సామాజిక వర్గం. ఇక గతంలో స్పీకర్‌గా పనిచేసిన ప్రతిభా భారతి, మాజీ మంత్రి పీతల సుజాత కూడా ఎస్సీలు. గతంలో తెలుగు మహిళ అధ్యక్షురాలిగా చేసిన రోజా, శోభా హైమావతితో పాటు ప్రస్తుత అనిత కూడా ఇతర వర్గాలకు చెందిన వారే. చివరికి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన పంచుమర్తి అనురాథకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అంతే తప్ప… టీడీపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు సరైన గుర్తింపు రావడం లేదనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో సోషల్ మీడియాలో ఎన్నో ట్రోలింగ్‌లకు గురైన తమను పోలీసులు కేసులు పెట్టి వేధించారని.. ఇప్పటికైనా తమకు గుర్తింపు దక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.