అక్కినేని వారసుడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని.. ఇప్పటి వరకు మూడు చిత్రాలు చేసినా హిట్టు ముఖమే చూడలేకపోయాడు. స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోయిన్స్ రంగంలోకి దిగినా.. ఈయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` అనే సినిమా చేస్తున్నాడు అఖిల్.
ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. మన బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మధ్య ఏ చిత్రం చేసినా బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తున్నాయి.
ఈ బ్యూటీ కాలు పెట్టిందంటే ఆ చిత్రం హిట్టయినట్టేనని చాలా మంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎందరో హీరోలకు, దర్శకులకు మోస్ట్ వాంటెడ్ లక్కీ హీరోయిన్గా పూజా మారిపోయింది. మరి ఎప్పటి నుంచో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్కు పూజా హెగ్డే లక్ కలిసొస్తుందా..? లేదా..? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.