తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే టైటిల్ తో రెండు, మూడు సినిమాలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే పాత టైటిల్స్ ను కొత్త సినిమాలకు వాడుకుంటున్నారు. అలాగే ఒకే కథతో రెండు సినిమాలు వచ్చిన సందర్భాలు బోలెడు. అలా గతంలో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా సేమ్ స్టోరీతో వచ్చాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. కథ ఒకటే అయినా ఇద్దరి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి.
మరి ఇంతకీ ఆ సినిమాలేవో తెలుసుకుందాం పదండి. జయంత్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం `బావగారూ బాగున్నారా?`. ఇందులో రంభ, రచన హీరోయిన్లు కాగా.. 1998లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. పుష్కర కాలం తర్వాత దాదాపు ఇదే కథ ఎన్టీఆర్ సినిమా వచ్చింది. అదే `బృందావనం`. ఇందులో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లుగా నటించారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
అయితే బావగారూ బాగున్నారా, బృందావనం చిత్రాలను గమనిస్తే.. ఇంచుమించు స్టోరీ ఒకేలా ఉంటుంది. రెండు చిత్రాల్లోనూ చెల్లితో ప్రేమలో పడ్డ హీరో.. అనుకోని పరిస్థితుల కారణంగా అక్క కోసం ఆమె ఇంటికి వెళ్తాడు. రెండిట్లో హీరో హీరోయిన్ తండ్రికి నచ్చడు. ఆ తర్వాత తన ప్రవర్తనతో అందరి మనసులు గెలుచుకుంటాడు. విలన్ల తిక్క కుదుర్చుతాడు. పైగా శ్రీహరి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అటు బావగారూ బాగున్నారాతో పాటు ఇటు బృందావనంలోనూ నటించారు. ఈ రెండు సినిమాల స్టోరీ ఎనభై శాతం సేమ్ టు సేమ్ అన్నట్లు ఉంటుంది. చివరకు రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.