శంకరాభరణం, స్వాతిముత్యం, సినివెన్నెల లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి తెలుగు జాతి ఖ్యాతి ని, తెలుగు దర్శకుల సృజనాత్మకతను ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన దిగ్గజ దర్శకుడు, రచయిత, నటడు కళాతపస్వీ కె. విశ్వనాథ్(92) ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణ వార్త సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. విశ్వనాథ్ మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కళాతపస్విని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఐదు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసిన లెజెండ్రీ డైరెక్టర్ చనిపోతూ చేసిన చివరి పనేంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు. ఎందుకంటే, సినిమా కోసమే ఆయన తపన.. సినిమా కోసమే ఆయన చివరి శ్వాసగా బతికాడు కళాతపస్వి.
తన చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు. తన కెరీర్ ని అద్భుతమైన స్టేజీకి తీసుకెళ్లిన `శంకరాభరణం` సినిమా విడుదలైన రోజే కన్నుమూసిన కళాతపస్వి.. మరణానికి ముందు ఒక పాట రాయడానికి పూనుకున్నారు. సాంగ్ రాస్తూ.. కాసేపటికే దాన్ని రాయలేక కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమన్నారు. ఆయన పాట రాస్తుండగానే విశ్వనాథ్ కుప్ప కూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.