నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్ అందుకుని.. వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. మళ్లీ ఆ సినిమా తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు బాలకృష్ణ. ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో కూడా మరింత పాపులర్ అయ్యాడు బాలయ్య.
ఈ క్రమంలోనే వీర సింహారెడ్డి సూపర్ హిట్తో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాదులో ఎంతో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య కొన్ని అనుకోని వ్యాఖ్యలు చేశారు. ఇక అవి ఇప్పుడు ఎంతో పెద్ద దుమారానికి దారి తీసాయి. ఆ కార్యక్రమంలో బాలయ్య ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు చెబుతూ.. ఈ సినిమా ప్రొడ్యూసర్ల గురించి మాట్లాడే సమయంలో షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ అక్కినేని.. తోక్కినేని.. ఆరంగారావు ఈ రంగారావు అంటూ ఆయన అన్న వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్గిరాజేశాయి.
ఈ వ్యాఖ్యలపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాలయ్యను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఏఎన్నార్ మనవళ్లయిన నాగచైతన్య, అఖిల్ బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా పోస్టులు పెట్టగా.. అక్కినేని ఫ్యాన్స్ బాలయ్యపై విరుచుకుపడుతున్నారు.బాలయ్య మాత్రం తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికి స్పందించలేదు. మరోవైపు ఎస్విఆర్ ను అవమానించిన బాలయ్య క్షమాపణలు చెప్పాలంటు కాపునాడు పేరుతో కొందరు ప్రకటనలు కూడా విడుదల చేయడం మొదలుపెట్టారు.
కాగా ఇప్పుడు ఎస్వీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం బాలయ్య వ్యాఖ్యలను తప్పు పట్టడానికి ఏమీ లేదని తేల్చేశారు. ఎస్వీ రంగారావు గారి మనవళ్ళు అయిన చిన్న ఎస్.వి.ఆర్, ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. ”నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది”.
”మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు”. ”ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం’ అని విజ్ఞప్తి చేశారు”.