దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో `ఆర్ఆర్ఆర్` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ చిత్రం చేయనున్నాడు. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కకముందే.. రాజమౌళితో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు మంతనాలు షురూ చేశారట. తాజాగా రాజమౌళిని కలిసిన మైత్రీ నిర్మాతలు.. భారత సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని చిత్రాన్ని చేసేందుకు భారీ ప్లాన్ వేశారట. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళికి అడ్వాన్స్ కూడా ఇచ్చారట.
మరో విషయం ఏంటంటే.. ఈ భారీ బడ్జెట్లో చిత్రంలో ముగ్గురు హీరోలు నటించనున్నారట. అందులో ఒకరు రెబల్ స్టార్ ప్రభాస్ కాగా.. మిగిలిన ఇద్దరూ తెలుగు హీరోలే అని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే నెల రాజమౌళి బర్త్డే సందర్భంగా ప్రకటించనున్నారని టాక్.