టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సురేష్ బాబు, వెంకటేష్ ల బాబాయ్, మూవీ మొగల్ దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం బాపట్ల జిల్లా కారంచేడులోని తన సొంత నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న దగ్గుబాటి కుటుంబం మరియు సురేష్ బాబు ఆయన కొడుకు అభిరామ్ తన బాబాయ్ ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు.
హీరో వెంకటేష్ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉండడంతో కారంచేడుకు రాలేకపోయినట్టు తెలుస్తుంది. రేపటి ఉదయానికి వెంకటేష్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. చీరాలలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఓ థియేటర్ ఉంది. దాని నిర్వహణ మోహన్ బాబు చూసుకునేవారని సమాచారం. మోహన్ బాబు మరణంతో దగ్గుబాటి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
చిత్ర పరిశ్రమలో ఉన్న పలువురు ప్రముఖులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మోహన్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఆయన మృతదేహానికి పలురు రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తంతం చేశారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, చీరాల వైసీపీ సమన్వయకర్త కరణం వెంకటేష్ మోహన్ బాబు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. దగ్గుబాటి మోహన్ బాబు అంత్యక్రియలు రేపు కారంచేడులో నిర్వహించనున్నారట. ఈ కార్యక్రమానికి టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలుస్తుంది.