వైసీపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోంది. ఇది చాలా రోజుల నుంచి ఉన్నా..విడతల వారిగా నాయకులు మారుతున్నారు. గతంలో కే.జే. కుమార్.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అండతో చెలరేగిపోతున్నారని.. రోజా విరుచుకుపడ్డారు. దీనిపై ఏం జరిగిందో ఏమో.. ఆయన కొంత తగ్గారు. మంత్రిగా .. రోజా బాధ్యతలు స్వీకరించాక..కుమార్ దూకుడు తగ్గింది. దీంతో రోజా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక, తన గెలుపును ఎవరూ ఆపలేరనే ధీమాకు కూడా వచ్చారు.
అయితే.. ఇప్పుడు కొత్తగా.. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. రోజాకు కంట్లో నలుసుగా మారారు. ఆయన నగరి నియోజకవర్గంలోనే కార్యక్రమాలు చేపడుతూ.. కుమార్ తరపున వాయిస్ వినిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుమార్ సతీమణిని బలపరచాలంటూ.. కార్యకర్తలకు.. పిలుపునిస్తున్నారు. ఇది రోజాకు మింగుడు పడడం లేదు. గత ఎన్నికల్లో బాగానే ఉన్న చక్రపాణి రెడ్డికి.. మంత్రి పదవి వస్తుందని.. ప్రచారం జరిగింది. అయితే.. తన ప్లేస్ను లాబీయింగ్ చేసి.. రోజా దక్కించుకుని మంత్రి అయ్యారనే వాదన ఆయన వర్గంలో ఉంది.
దీంతో ఎక్కడికక్కడ రోజాను ఆయన నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం .. రాష్ట్రానికి పాకింది. రోజా ఏకంగా.. ఒక సెల్పీ వీడియోను తీసుకుని.. ఇలా అయితే.. పార్టీలో ఉండలేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకున్న వ్యతిరేక వర్గం.. జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. రోజా అవసరమైతే.. పార్టీ మారిపోయేలా ఉన్నారని.. ఆమెను నమ్మడానికివీల్లేదని.. చక్రపాణి వర్గం కొత్త ప్రచారానికి దిగింది.
దీంతో నియోజకవర్గంలో రోజా అనుచరులు.. ఎదురుదాడికి దిగాలని ప్రయత్నించారు. కానీ, వారిని కూడా చక్రపాణి వర్గం మేనేజ్ చేసింది. ఫలితంగా.. ఇప్పుడు రోజా పర్యటనలకు తన వర్గం తగ్గిపోయింది. కీలకమైన నాయకులు కూడా.. దూరంగా ఉంటున్నారు. వివిధ కారణాలతో పార్టీకార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అదేసమయంలో చక్రపాణి పిలుపునిస్తే.. ఆయన వెంట తిరుగుతున్నారు.
రెండు రోజుల కిందట చక్రపాణి రెడ్డి తన కుమారుడితో కలిసి నిర్వహించిన గడపగడపకు కార్యక్రమంలో రోజా అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో మంత్రి ఆశ్చర్యపోయారు. అయితే.. దీనిపై ఏమీ అనలేక.. అలాగని సైలెంట్గా ఉండలేక.. సతమతం అవుతున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటుందోలేదో చూడాలి.