తెలుగు రాజకీయాలకు కులాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇది ఎవరు కాదన్నా ? ఎవరు ఔనన్నా నిజం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాల ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. ఏపీలో నిన్నటి వరకు కమ్మ వర్సెస్ రెడ్ల మధ్య అధికారం కోసం వార్ జరుగుతుంటే ఇప్పుడు ఈ పోరులో కాపులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలంగాణలో అధికారం కోసం ఇప్పుడు వెలమ వర్సెస్ రెడ్ల మధ్య పోరు జరుగుతోంది.
ఇక తెలంగాణలో కంటే ఏపీలోనే కాస్త ఎక్కువుగా ఈ కుల రాజకీయాల ప్రాబల్యం ఎక్కువుగా కనిపిస్తుంటుంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు తర్వాత ఇది మరింతగా వేళ్లూనుకుంది. ఇక ఏపీలో గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాలన్ని కమ్మ, రెడ్ల చుట్టూనే తిరుగుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు అధికారం చెలాయిస్తే, టీడీపీలో కమ్మలు అధికారం అనుభవించారు.
సంఖ్యాపరంగా చూసుకుంటే ఈ రెండు సామాజిక వర్గాల కన్నా కాపులే అధిక సంఖ్యలో ఉంటారు. ఈ వర్గానికే చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఇక గత ఎన్నికలకు ముందు కూడా చిరు సోదరుడు పవన్కళ్యాణ్ జనసేన స్థాపించినా ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటోన్న బీజేపీ టీడీపీని క్రమక్రమంగా దూరం చేసే ప్రక్రియ స్టార్ట్ చేసినట్టు కనపడుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ కాపులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. బీజేపీ కాపులను తన వైపునకు తిప్పుకుని, వైసీపీతో జట్టుకడితే అది రాజకీయంగా టీడీపీకి పెద్ద దెబ్బే అవుతుంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు ఇప్పుడు కాపులను టీడీపీకి దగ్గర చేసే సూపర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు ఈ విషయంలో దాదాపు సక్సెస్ అయినట్టే తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చేసిన మోసాన్ని పదే పదే ఎండగడుతోన్న పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టి పోటీ చేసేందుకు సోమవారం చంద్రబాబుతో జరిగిన భేటీలో దాదాపుగా డెసిషన్ తీసుకున్నట్టే సమాచారం.
ఈ క్రమంలోనే పవన్ నంద్యాల ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటిస్తాడని తెలుస్తోంది. ఇక్కడ ఏ పార్టీకి మద్దతు ఇచ్చే విషయమై రెండు రోజుల్లో ప్రకటిస్తానని పవన్ చెప్పాడు. నంద్యాల సెగ్మెంట్ లో 30 వేల వరకూ ఈ వర్గం ప్రజల ఓట్లు ఉన్నాయి. వీటితో పాటు యువ ఓటర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంది. దీంతో పవన్ మద్దతిస్తే, కాపు, బలిజ వర్గం ఓట్లు అధిక మొత్తంలో పడడం ఖాయం.
ఇక బీజేపీ వైసీపీకి దగ్గరవుతున్న క్రమంలో పవన్ కూడా చంద్రబాబుతోనే జట్టుకట్టి ముందుకు వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తోన్న పవన్ ఆ సినిమాను అక్టోబర్కు కంప్లీట్ చేసి, దసరా నుంచి పూర్తిగా రాజకీయ కార్యాచరణతోనే ముందుకు వెళ్లనున్నాడు. ఏదేమైనా పవన్ను మొత్తానికి తన వైపునకు తిప్పుకుంటోన్న బాబు ఏపీలో కాపులు+కమ్మలను రాజకీయంగా ఒక్కటి చేసేందుకు పెద్ద స్కెచ్చే వేస్తున్నారు. మరి బాబు ప్రయత్నాలు ఆయన్ను 2019లో మరోసారి అధికారంలోకి తెస్తాయో ? లేదో ? చూద్దాం.