తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాల్లో జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గొప్ప సినిమాగా నిలిచిన ఈ సోషియా ఫాంటసీ డ్రామా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. మే9 న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. మే9, 1990 లో రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 9న మరోసారి ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. అప్పుడు రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది. ఇక రిలీజ్ టైమ్లో ఈ సినిమా పేరిట చాలానే రికార్డులు నమోదయ్యాయి.
ఇంకా చెప్పాలంటే ఆ సినిమా రిలీజ్ టైమ్ లో టికెట్ రేటు రూ.6 కాగా.. మ్యాట్నీ షో కు ఆ టికెట్లు రూ. 210 లకు అమ్ముడయ్యాయంటే.. సినిమా క్రేజ్ ఏంటో ఊహించుకోవచ్చు. అంటే మామూలు టికెట్ రేటుకు అది 35 రెట్లు ఎక్కువన్నమాట. ఇక ఈ సినిమాలో చిరంజీవి టూరిస్ట్ గైడ్ గా కనిపించగా, శ్రీదేవి ఇంద్రజ పాత్రలో నటించింది. వీరిద్దరితో పాటూ అమ్రిష్ పూరి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలినీ, బేబీ షామిలీ కూడా కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాను ఆ రోజుల్లో భారీ బడ్జెట్తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా.. నిర్మాత అశ్వినీదత్ నిర్మించాడు. యండమూరి వీరేంద్రనాథ్ కథను అందించిన ఈ సినిమాకు.. జంధ్యాల స్క్రీన్ ప్లే అందించారు. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ కు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.ఇక మే 9న రీరిలీజ్ కానున్న ఈ మూవీ ఈసారి ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.