1990లో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్లలో రంభ ఒకటి. దాదాపు అప్పటి స్టార్ హీరోల అందరి సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీకి దూరమై ఇప్పటికే 15 ఏళ్లు గడుస్తుంది. ప్రస్తుతం మా టీవీ రియాల్టీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. పెళ్లి తర్వాత కన్నడలో సెటిల్ అయ్యానని.. ప్రస్తుతం మళ్లీ తెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. మంచి పాత్ర దొరికితే నటిస్తానంటూ వెల్లడించింది.
కాగా.. ఇన్నాళ్లు రంభ సినిమాలకు దూరం కావడానికి గల కారణం ఏంటో చెప్పుకొచ్చింది. పిల్లలకు ఒక వయసు వచ్చేవరకు తల్లిగా నా పూర్తి బాధ్యతలు తీసుకున్నానని.. వారికి దగ్గరుండి అన్ని చూసుకున్నా.. ఇప్పుడు మా బాబుకి 6 ఏళ్లు, కూతుళ్ళకి 14, 10ఏళ్ళు.. ఇప్పుడు ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసేసుకుంటున్నారు. వాళ్ళను చూసుకోవడం కోసమే నేను ఇన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. కానీ నాకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో నా భర్తకు తెలుసు.. ఆయన ఎంకరేజ్మెంట్ తోనే ఈ షో కి జడ్జ్ గా వచ్చా.. ఈ షో కోసం నన్ను సంప్రదించినప్పుడు చేయాలా వద్దా అని ఎంతగానో ఆలోచించా అని వివరించింది.
ఇక నా కుటుంబం నన్ను ప్రోత్సహించింది.. మొదటిసారి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంతలా భయపడ్డాను.. ఈ కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చి డ్యాన్స్ వేసేటప్పుడు అంతే భయపడ్డా.. వ్యాన్ నుంచి కిందకు రావడానికి కూడా ఆలోచించా. కానీ.. ఒకసారి స్టేజ్ పై డ్యాన్స్ వేశాక.. అందరూ చప్పట్లు నాలో భయాన్ని మొత్తం పోగొట్టేసాయి. 30 ఏళ్ల క్రితం మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయిందని చెప్పుకొచ్చింది. సినిమాలకు 15 ఏళ్ల దూరమైన నా రక్తంలో నటన ఉండిపోయింది. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన ఎంతోమంది ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. అందుకే నేను కూడా మరోసారి వెండి తెరపై కనిపించాలని నిర్ణయించుకున్న అంటూ చెప్పుకోచ్చింది.