బాబు వెస్ట్ టూర్..వైసీపీ ఫెయిల్ చేస్తుందా?

మరో సరికొత్త కార్యక్రమంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళుతున్నారు. మొన్నటివరకు బాదుడేబాదుడు కార్యక్రమం పేరుతో ప్రజల్లో తిరిగిన టీడీపీ శ్రేణులు..ఇప్పుడు ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ అనే పేరుతో ముందుకెళ్లనున్నారు. ప్రజా సమస్యలు, వైసీపీ ప్రభుత్వం వల్ల పడుతున్న ఇబ్బందులని..టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్ళి వివరించనున్నారు. 50 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇక ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలోని  కలపర్రు టోల్‌గేట్‌ మీదుగా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ప్రారంభం కానుంది. చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమాన్ని తమ తమ నియోజకవర్గాల్లో మొదలుపెడతారు. ఇక బాబు వెస్ట్ టూర్‌లో భాగంగా మొదట విజయరాయి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత రోడ్ షో ద్వారా చింతలపూడి బహిరంగ సభలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ టూర్..చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో సాగనుంది.

చంద్రబాబు ఆదరణ చూసి ..  ఓర్వలేకపోతున్న జగన్‌

అయితే చంద్రబాబు టూర్‌ని సక్సెస్ చేసేందుకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నాయి. ఇక బాబు టూర్‌కు ఆటంకాలు కల్పించడానికి వైసీపీ శ్రేణులు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇటీవల కర్నూలు టూర్‌కు వెళ్లినప్పుడు భారీ స్పందన వచ్చింది. వైసీపీ కంచుకోటగా ఉన్న కర్నూలులోనే బాబు రోడ్ షోలకు, సభలకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

ఇక టీడీపీ కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరిలో బాబు టూర్‌ని భారీగా సక్సెస్ చేయాలని టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు సైతం టూర్‌ని ఫ్లాప్ చేయడానికి పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వెస్ట్ గోదావరిలో బాబు టూర్ కోసం కట్టిన ఫ్లెక్సీలని, టీడీపీ జెండాలని పీకేశారు. ఇక బాబు టూర్‌కు కూడా అడ్డంకులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి బాబు టూర్ ఎలా జరుగుతుందో.