నంద్యాల ఉప ఎన్నిక రిజల్ట్ అనంతరం వైసీపీ అధినేత జగన్ పరువు ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బజారున పడింది. జాతీయ మీడియా జగన్ను ఏకిపారేసింది. ఎందుకింత అహంభావం! అంటూ నిప్పులు చెరిగింది. సీఎంనే కాల్చిపారేయాలన్న జగన్ని జనం తమ ఓట్లతో కాల్చేశారంటూ ఎద్దేవా చేసింది. రాజకీయాల్లో పరిణితి సాధించలేని నేత.. రేపు అధికారంలోకి వస్తే.. పాలనలో ఏం పరిణితి చూపిస్తాడంటూ.. నిప్పులు చెరిగింది. అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసింది. రాజకీయంగా ఎలా వ్యవహరించాలో? ఎంత జాగ్రత్తగా నడవాలో? టీంను నడిపించాలో? బాబుకు తెలిసినంతగా దేశంలో చాలా మంది సీనియర్ నేతలకు తెలియడం లేదని పొగడ్తలతో ముంచెత్తింది.
వాస్తవానికి జగన్కి, జాతీయ మీడియాకు ఉన్న అనుబంధం సెపరేటు. నిజానికి జగన్ ఏం చెప్పాలన్నా.. స్థానిక తెలుగు మీడియాను పక్కన పెట్టి.. జాతీయ మీడియాకు ఆహ్వానాలు పలుకుతారు. గతంలో అనేక సార్లు ఆయన జాతీయ మీడియాకే ఇంటర్వ్యూలూ ప్రెస్మీట్లు పెట్టి అనేక విషయాలు వెల్లడించారు. దీనికితోడు తనకు అనుకూలంగా వార్తలు రాసేందుకు విలేకర్లకు గిఫ్టులు ఇస్తారని, పత్రికలకు భారీ ఎత్తున ప్రకటనలు గుప్పిస్తారని కూడా జగన్ గురించి విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఆయన ఎక్కడా ఆగింది లేదు. ఏది జరిగినా.. ఏం చెప్పాలన్నా ముందు జాతీయ మీడియాకే జగన్ జైకొట్టేవారు.
దీంతో 2014కు ముందు జాతీయ మీడియా జగన్ను ఆకాశానికి ఎత్తేసింది. సీఎంగా ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఉన్నాయని డప్పుకొట్టింది. అయితే, ఇటీవల పరిస్థితిమారింది. జగన్ జాతీయ మీడియాను సంతృప్తి పరచలేకపోతున్నారు. దీంతో ఆయనకు ఇప్పుడు అదే మీడియా భీతిగొలిపిస్తోంది. నంద్యాలకు ముందు, నంద్యాల తర్వాత అన్నట్టుగా జగన్ వ్యవహారశైలిపై నిప్పులు చెరుగుతోంది. ముఖ్యంగా సంయమనం కోల్పోయి చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడుతోంది. నాయకుడంటే ఎలా ఉండాలో బాబును చూసైనా నేర్చుకోవాలని ఏకేస్తోంది.
కేవలం అధికారం కోసం, అధికారమే పరమావధిగా జగన్ రాజకీయాలు చేస్తున్నాడని, తన కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రంతోను సంబంధాలు పెట్టుకుంటున్నాడని, ఈ క్రమంలో బాబు అంటున్నట్టు జగన్ లాంటి నేతలు మనకు అవసరమా? అన్న వ్యాఖ్యలపై జనాలు దృష్టి పెడుతున్నారని కూడా జాతీయ మీడియా తాజా కథనంలో హెచ్చరికలు సైతం జారీ చేసింది. నంద్యాల జనాల ఫార్ములాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అమలు చేస్తే.. జగన్ అడ్రస్ 2019లో గల్లంతవడం ఖాయమంటూ పెద్ద కథనాలు ప్రచురించింది. మరి జగన్ వీటిని ఏమంటారో? ఇవి కూడా ఎల్లో మీడియా టైపంటూ రెండు బండలు పడేస్తారో? పద్ధతి మార్చుకుంటారో చూడాలి.