ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు బాబు వేటు నుంచి తప్పించుకున్నారు. ప్రక్షాళన వార్తలు స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రత్తిపాటికి సైతం బాబు ఉద్వాసన పలుకుతారని వార్తలు జోరుగా హల్చల్ చేశాయి. గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిషోర్బాబుతో పాటు ప్రత్తిపాటిని కూడా మార్చేసి జిల్లా నుంచి అదే సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి అంటూ ఊహాగానాలు వచ్చాయి.
ఈ ప్రక్షాళనలో రావెలను తప్పించిన చంద్రబాబు ప్రత్తిపాటిని మాత్రం అలాగే ఉంచేశారు. ప్రత్తిపాటిపై అగ్రిగోల్డ్ భూముల వ్యవహరాంతో పాటు శాఖా పరమైన ఆరోపణలు, నియోజకవర్గంలో భార్య, బావమరుదుల పెత్తనంతో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ప్రత్తిపాటికి ఉద్వాసన ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో చంద్రబాబు వద్ద ఓ కీలక నేత చక్రం తిప్పడంతో ప్రత్తిపాటి సేఫ్ అయినట్టు టాక్.
ప్రత్తిపాటిని మంత్రి వర్గం నుంచి తప్పిస్తే జగన్ ఆయనపై చేసిన ఆరోపణలకు బలం ఇచ్చినట్లు అవుతుందని..ప్రత్తిపాటిని మంత్రివర్గంలో కంటిన్యూ చేయాలని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్రావు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారట. దీంతో చంద్రబాబుకు తీవ్రతర్జన భర్జనల అనంతరం ప్రత్తిపాటిని కంటిన్యూ చేసేందుకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
అయితే ఆయనకు శాఖల్లో మాత్రం కోతపెట్టి ప్రయారిటీ తగ్గిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రత్తిపాటిని మంత్రివర్గంలో కంటిన్యూ చేసేలా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చిన గరికపాటిపై గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్లు మండిపడుతున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన గరికపాటికి గుంటూరు జిల్లాలో ఏం పని అని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే పుల్లారావును మంత్రి పదవిలో కొనసాగించడం మెజార్టీ వర్గాలకు ఇష్టం లేదని జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.