ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కలకలం రేపారు.మూడు రాజధానులు.. పాలన వికేంద్రీకరణపై ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన వైసీపీ నాయకులు.. ఇప్పుడు చేతల వరకు దిగడంతో అసలు ఏం జరుగుతోందో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి.. ఏకైక రాజధాని కావాలంటూ.. రైతులు.. ఉద్యమిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వికేంద్రీకరణే కావాలంటూ.. వైసీపీ అనుబంధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే.. ఇప్పటి వరకు కేవలం మాటలకే పరిమితం అయింది. అటు.. ఏకైక రాజధాని కోరుతున్న టీడీపీ నేతలు కానీ.. ఇతర వర్గాలు కానీ.. తమ తమ పదవులకు రాజీనామాలు సమర్పించలేదు. కానీ, వికేంద్రీకరణ కు మద్దతుగా వైసీపీకి చెందిన కరణం ధర్మశ్రీ తాజాగా రాజీనామా చేయడం.. రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇది టీడీపీకి పెను సవాలుగా మారనుంది. ఏకైక రాజధానికి మద్దతుగా ఉన్న టీడీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయాలని కరణం డిమాండ్ చేశారు.
ఇక, ఇప్పటి వరకు వైసీపీ మంత్రులు.. ధర్మాన ప్రసాదరావు.. సీదిరి అప్పలరాజు కూడా.. మంత్రి పదవుల కు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కరణం రాజీనామా.. ఎటు మలుపుతిరుగుతుందనేది ఆసక్తిగా మారింది. అయితే ఆయన బాటలోనే మరి కొందరు సైతం రాజీనామాలకు సిద్ధం అని చెపుతున్నారు. ఇది జగన్కు సైతం షాకే అని పార్టీలో చర్చ నడుస్తోంది.
కరణం డిమాండ్ మేరకు.. టీడీపీ రాష్ట్ర చీఫ్.. అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా? లేక.. దీనిని రాజకీయ స్టంటుగానే చూస్తారా? అనేది.. చూడాలి. ఇప్పటి వరకు అయితే.. ఉరుముల లేని పిడుగులా.. కరణం రాజీనామా అస్త్రం సంధించడం.. మాత్రం సంచలనంగానే మారిందని చెప్పాలి.