ఇప్పటికే చేతిలో ఆరు సినిమాలు.. మరో సినిమా అనౌన్స్ చేసిన యంగ్  హీరో..!

టాలీవుడ్ హీరో నాగ శౌర్య.. చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆరు సినిమాలు చేస్తుండగా.. తాజాగా మరో సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. ప్రస్తుతం నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన వరుడు కావలెను సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదల అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నాగశౌర్య ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో నటించిన లక్ష్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కొన్ని నెలల కిందటే పూర్తయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విడుదలకు నోచుకోలేదు.

అలాగే పోలీసువారి హెచ్చరిక అనే థ్రిల్లర్ మూవీ లో కూడా నాగశౌర్య నటిస్తున్నాడు. నారీ నారీ నడుమ మురారి అనే సినిమాలో నటించేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు. తనతో ఊహలు గుసగుసలాడే వంటి సూపర్ హిట్ సినిమా తీసిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి అనే సినిమాలో నాగశౌర్య నటిస్తున్నాడు.

చేతిలో ఇన్ని సినిమాలు ఉండగా తాజాగా నాగ శౌర్య తాను కొత్తగా చేస్తున్న మరో సినిమా గురించి అఫీషియల్ గా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్, ఎల్ ఎల్ పి, ఏసియన్ సినిమా బ్యానర్స్ పై సునీల్ నారంగ్ నిర్మించనున్న ఓ ప్రేమకథా చిత్రంలో నాగశౌర్య నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే వెల్లడికానున్నాయి. ‘నేను మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు చేయబోతున్నా.. ఈ సినిమా చేసేందుకు ఎంతో ఎక్సైట్ మెంట్ గా ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.’ అని నాగశౌర్య ట్వీట్ చేశారు.