నందమూరి బాలకృష్ణ తొలిసారిగా తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మ కల సినిమాలో నటించారు. ఈ సినిమా 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. ఈనెల 30వ తేదీకి బాలకృష్ణ నటుడుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ శుభ తరుణంలో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు సినీ పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరిగే ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు బుధవారం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ – నందమూరి మోహనకృష్ణ ఇద్దరు బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్ లాంచ్ చేశారు.
ముందుగా మోహన్ కృష్ణ మాట్లాడుతూ మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మానాన్న గారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అడ్డా నందమూరి గడ్డ అని నిరూపించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా బాలయ్య నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా కుర్రహీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే ఇన్ని ఏళ్లు నటుడిగా చేసిన వాళ్లు ఎవరూ లేరని తెలిపారు. మరో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ రామారావు గారి నట వారసుడు నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ మొత్తం కలిసి టాలీవుడ్ పవర్ ఏంటో చూపించేలా గొప్పగా చేస్తామన్నారు.
సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..‘బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేసింది నేనే. 13 సినిమాలు ఆయనతో చేశానంటే ఆయన ఎంత మంచి వాడో అర్థమవుతుంది. అన్నగారి బాటలోనే బాలయ్య కూడా దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారని.. ఇటీవల ఎక్కడికి వెళ్లినా జై బాలయ్య అంటున్నారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1న వైభవంగా జరగనుంది.