మాజీ మంత్రి, దివంగత వైఎస్ హయాంలో ఆయనకు ఎంతో నమ్మకస్తుడైన అనుచరడుగా మెలిగిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో గట్టి పట్టున్న నేత కొణతాల రామకృష్ణకు పొలిటికల్ డయాస్ కన్ఫర్మ్ అయిందట! రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్లో ఉండలేక… జగన్ నేతృత్వంలోని వైకాపాలోకి వచ్చేశారు కొణతాల. అయితే.. పార్టీలో అధ్యక్షుడి వైఖరితో విసుగెత్తిన ఆయన ఓ ఫైన్డే వైకాపాకి హ్యాండిచ్చేశారు. అయితే, అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉన్నారు. అయితే, మొన్నామధ్య అంతా సెటిల్ అయిపోయింది. ఇంక, చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కడమే లేటనే ప్రచారం జరిగింది.
అయితే, కొణతాల మాత్రం తన పొలిటికల్ లైఫ్పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇక, ఇప్పుడు మాత్రం ఆయన చేపడుతున్న కార్యక్రమాలను బట్టి.. త్వరలోనే ఆయన పవన్ నేతృత్వంలోని జనసేనలో చేరతారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హాదా కోసం పవన్ ఉద్యమిస్తున్న నేపథ్యంలో మరోపక్క కొణతాల ఇదే ఉద్యమాన్నిక్షేత్రస్థాయలోకి తీసుకువెళ్లే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. చాయ్ పే చర్చ పేరుతో ఆయన చేపట్టిన కార్యక్రమానికి స్పందన బాగానే ఉందని సమాచారం.
ఉత్తరాంధ్రంలోని టీ దుకాణాల్లో కొణతాల ఈ చర్చ చేపడుతున్నారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దీనివల్ల లాభాలేంటి? వంటి అనేక సంగతులను ఆయన వివరిస్తున్నారు. దీనిని బట్టి.. ఆయన పొలిటికల్ ఫ్యూచర్ను అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. కొణతాల టీడీపీలో చేరే ఛాన్స్ లేదని అంటున్నారు. టీడీపీ ఇప్పటికే ప్యాకేజీకి ఫిక్సయిపోయిందని, ఈ నేపథ్యంలో హోదా గురించి మాట్లాడవద్దని చంద్రబాబు తన టీంను హెచ్చరించారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యలో కొణతాల హోదా పల్లవి అందుకోవడం కేవలం జనసేన అధినేత దృష్టిలో పడడం కోసమేనని చెబుతున్నారు.
ఈ క్రమంలో కొణతాల టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదని, పోనీ వైకాపాలోకి వెళ్తారా? అంటే అదికూడా జరిగే పనికాదని తేల్చారు. గతంలో అధినేత జగన్ వైఖరి నచ్చకపోవడంతోనే కొణతాల బయటకు వచ్చారని మరి ఇప్పడు వెళ్లే ఛాన్స్ లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన త్వరలోనే జనేసన అధినేతను కలిసి.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చని అంటున్నారు.మరోపక్క, పవన్ కూడా కొణతాల వంటి యువ నేతలకు ప్రాధాన్యం ఇస్తారని టాక్. ఇదే జరిగితే..జనసేనకు ఉత్తరాంధ్రంలో బలమైన నేత లభించినట్టే.!!