ప్రస్తుతం టాలీవుడ్లో అంతా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా మహేష్బాబు నటించిన క్లాసికల్ హిట్ సినిమా మురారీ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా అదిరిపోయే వసూళ్లతో ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. మహేష్ బాబు మురారి వసూళ్లతో బిజినెస్ మ్యాన్ మొదటి రోజు వసూళ్లు, అలాగే ఖుషి ఫుల్ రన్ వసూళ్లను అధిగమించి కొత్త ఆల్ టైం రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు మురారి రికార్డు ని సెప్టెంబర్ 2 న విడుదల కాబోతున్న గబ్బర్ సింగ్ సినిమాతో బ్రేక్ చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కసితో ఉన్నారు.
తమ అభిమాన హీరో పవర్ ఏంటో చూపించాలని వీళ్లు భావిస్తున్నారు. ఇక ఓవర్సీస్లో అయితే గతంలో ఎన్నడు లేని విధంగా గబ్బర్సింగ్ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఒక్క నార్త్ అమెరికాలో ఈ సినిమా వంద లొకేషన్లలో విడుదల కాబోతున్నట్టు సమాచారం. ఒక్క ప్రాంతం నుంచే మూడు లక్షల డాలర్ల వసూళ్లను రాబట్టాలని.. ఓవర్సీస్ నుంచే 5 లక్షల డాలర్ల వసూళ్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక కర్నాటక రెస్టాఫ్ ఇండియాలో కూడా గ్రాండ్గా రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతోంది. భారీ వసూళ్లతో ప్రపంచ వ్యాప్తంగా రు. 15 కోట్ల రూపాయల వసూళ్లతో మురారీ రీ రిలీజ్ వసూళ్లను ఒక్క రోజులో కొట్టేసేలా ప్లానింగ్ జరుగుతోంది. పైగా ఇప్పుడు పవన్ కు ఏపీలో ఫుల్ క్రేజ్ ఉంది. పవన్ ఏపీలో డిప్యూటీ సీఎంగాను.. పిఠాపురం ఎమ్మెల్యేగానే కాకుండా.. రెండు.. మూడు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. దీంతో గబ్బర్సింగ్ రికార్డుల మోత మోగిస్తుందని అంటున్నారు.