తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాట వినపడకూడదు.. ఎంతటి వాళ్ళయినా ఉపేక్షించకండి.. తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మన రాష్ట్రం మారాలి అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ నివారణ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదేపదే ఆర్డర్స్ పాస్ చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి డ్రగ్స్ పై తీవ్ర పోరాటం చేసిన ఈయన.. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత దీనిపై మరింత ఫోకస్ చేశారు. ఈ క్రమంలో తాజాగా సినీ ఇండస్ట్రీకి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. డ్రగ్, సైబర్ క్రైమ్ నివారణకు.. ఇండస్ట్రీ ప్రోత్సహించాలని.. సమాజాన్ని పీడిస్తున్న సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని సూచించాడు.
కేవలం టికెట్ల ధరల పెంపు కోసం, షూటింగ్ అనుమతుల కోసం సినీ ప్రముఖుల ప్రభుత్వం వరకు రావలసిన పనిలేదని.. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ చెప్పుకొచ్చాడు. కొత్త సినిమాలో విడుదల ముందు.. సినిమాలో ఉన్న నటలతో డ్రగ్స్ పై అవగాహన వీడియోను తయారు చేయాలని.. అలా చేస్తేనే ఇప్పటినుంచి తెలంగాణ ప్రభుత్వ సహకారం సినిమాకు అందుతుందంటూ వార్నింగ్ ఇచ్చాడు. వందల కోట్లు సంపాదిస్తున్నారు.. అలాగే సమాజానికి కూడా ఇండస్ట్రీ మేలు చేయాలి.. కోట్ల రూపాయల తీసుకుంటున్నప్పుడు ప్రజల బాగు కోసం కూడా ఇలాంటి అవగాహన వీడియోలు చేయాల్సిందే అంటూ వెల్లడించాడు.
థియేటర్లలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఉచిత వీడియోలు ప్రదర్శించాలని చెప్పుకొచ్చాడు. డ్రగ్స్ నిర్మూలన సామాజిక బాధ్యతగా తీసుకొని వాటి నియంత్రణ కోసం చిరంజీవి వీడియో సందేశాన్ని పంపారని.. దేశంలో యువత డ్రగ్స్ బారిన పడద్దని అవగాహన కార్యక్రమంలో మెగాస్టార్ భాగమైనందుకు అభినందనలంటూ తెలియజేశాడు. ఆయనతో పాటు డ్రగ్స్ నియంత్రణకు చాలామంది చేతులు కలపాల్సి ఉందని.. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న మనం కొంతైనా సమాజానికి తిరిగి ఇవ్వాలని చెప్పుకొచ్చాడు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టిపీడిస్తున్న తీవ్ర సంఘటనలని.. వాటి నియంత్రణకు కృషి చేయమంటూ సినీ ఇండస్ట్రీని కోరాడు.