ఒకే ఫ్రేమ్ లో మెరిసిన తారక్, చెర్రీ.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని రెట్టింపు చేసిన రాజమౌళి సినిమాలలో ఆర్‌ఆర్ఆర్ ఒకటి. అంతర్జాతీయంగా భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్యన ఆన్ స్క్రీన్ బాండింగ్.. బ్రోమ్యాన్స్‌ సినిమా సక్సెస్ కు మొదటి కారణమని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో వీళ్ళిద్ద‌రి కెమిస్ట్రీ కూడా గొప్పగా వర్కౌట్ అయింది అనడంలో సందేహం లేదు. దీనికి కారణం వీరిద్దరూ రియల్ లైఫ్ లో కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, స్నేహం అనే వీరే స్వ‌యంగా వివరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఇద్దరూ కలిసి పాల్గొని సందడి చేశారు.

ప్ర‌తీ ఇవెంట్లో.. వీరిద్దరి మధ్యన ఉన్న అనుబంధం చూసి వీరి ఫ్యాన్స్ కూడా మ‌య‌మరిచిపోయారు. ఈ ప్ర‌మోష‌న్స్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి మధ్య ఉన్న బాండింగ్.. ప్రేమ, ఆప్యాయతలు అందరిని ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణెదల, జూనియర్ ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ ప్రణతి మధ్యన కూడా గొప్ప స్నేహబంధం ఏర్పడింది. ఇటీవల ఆర్‌ఆర్ఆర్ సీక్వెల్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్ళీ కలుస్తున్నారని ప్రచారం కూడా వినిపించింది. ఇదిలా ఉండగా చాలా గ్యాప్ తర్వాత మరోసారి రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ స్నేహితులు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు,, అనేది ఆరా తీయగా అనంత్‌ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం జామ్‌నగర్ చేరుకోవడానికి విమానాశ్రయానికి చేరుకున్నారని సమాచారం. ఈ వేడుకలకు వెళుతున్న నేపథ్యంలోనే.. విమానాశ్రయంలో ఇద్దరి మధ్య బ్రోమ్యాన్స్ మరోసారి హైలెట్ అయింది. ఈ వీడియోలో తారక్ వైట్ షర్ట్ ధ‌రించి పూర్తి ప్లైన్ లుక్ లో కనిపించగా.. రామ్‌చరణ్ ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకున్నాడు. బ్లాక్ లెదర్ జాకెట్ లో చరణ్ స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఈ వీడియోలో చరణ్ సతీమణి ఉపాసన కూడా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో చరణ్, తారక్ అభిమానుల్లో వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.