గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుష్ప నటుడు జగదీష్ అలియాస్ కేశవ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఓ యువతి ఆత్మహత్య కేసులో జగదీష్ ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఆ ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు అతడిని పోలీసులు తమ కస్టడీలోనే ఉంచారు. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి హైదరాబాద్ వచ్చిన జగదీష్కు ఐదేళ్ల క్రితం ఓ అమ్మాయి పరిచయం అయింది. కొంతకాలానికి అది కాస్త ప్రేమగా మారి శారీరకంగాను దగ్గరయ్యారట.
ఈ క్రమంలో పుష్పా సినిమాతో ఒక్కసారిగా భారీ పాపులారిటీ దక్కించుకున్న జగదీష్కు వరుస సినిమా అవకాశాలు పెరగడంతో.. అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అయితే ఇది నచ్చని ఆ అమ్మాయి జగదీష్ ను వదిలేసి మరో యువకుడికి దగ్గర అయిందట. ఆ విషయం తెలుసుకున్న జగదీష్ ఏదో విధంగా ఆమెను మళ్లీ తన దారిలోకి తెచ్చుకోవాలని గత నెల 27న పంజాగుట్ట ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న ఆ యువతి ఇంట్లోకి వెళ్ళాడట. ఆ సమయంలో ఆ యువతి వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉండడం చూసి సెల్ఫోన్తో ఫోటోలు తీశాడు. వాటిని ఆమెకే పంపి తన మాట వినకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు.
దీంతో అవమానంగా ఫీల్ అయిన ఆ అమ్మాయి గతనెల 29న తన స్వగృహంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జగదీష్ బెదిరింపులతోనే ఆమె అలా చేసిందని తండ్రికి తెలియడంతో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈనెల 6న జగదీష్ ను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించి విచారణ చేపట్టారు. దీంతో జగదీష్ నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. రెండు రోజులు కష్టడి ముగియడంతో అతడి మళ్ళీ రిమాండ్ కు తరలించారు. అయితే ఈ విచారణలో కేవలం ఆ యువతపై ప్రేమతోనే తన దారిలోకి తీసుకొచ్చుకోవాలన్న ఉద్దేశంతో జగదీష్ ఆమెను బెదిరించినట్లు పోలీసులు చెటుతున్నారు.