అదేంటి.. టీడీపీలో రిజైన్లేంటి? అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది.. అసలు విషయం. అధికార పక్షం నేత లపై నిప్పులు చెరిగే నాయకులు.. తమ సత్తా చాటుకునేందుకురెడీ అవుతున్నారు. ఈ క్రమంలో కొందరు నాయకులు..చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే.. మరికొందరు ఎంత ప్రయత్నిస్తు న్నా.. లైమ్లైట్లోకి రాలేక పోతున్నారు. ఇలాంటి వారు.. ఏదో ఒకటి చేసి.. వార్తల్లో నిలవాలని కోరుకుంటు న్నారు. ఈ క్రమంలోనే కర్నూలుకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు.. భూమా అఖిల ప్రియ కూడా సంచలన వ్యాఖ్య చేశారు. తాను రాజకీయాలకు రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఆళ్లగడ్డలో అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారన్న అఖిలప్రియ.. ఈ అవినీతిని నిరూపిస్తానని.. కొన్నాళ్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోలేదు. పైగా.. సొంత పార్టీ నాయకులే దీనిని పక్కన పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఆమె అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయాలకు గుడ్బై చెబుతానని ప్రకటించారు. ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ పేరుతో వైసీపీ నేతలు ప్రజలను లూటీ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
అంతేకాదు. ఈ క్రమంలో ప్రజలకు పరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచేస్తున్నారని మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రోడ్ల విస్తరణ పేరుతో వసూళ్లపై కలెక్టర్ దగ్గర విచారణకు రావాలని డిమాండ్ చేసిన ఆమె.. అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయలకు గుడ్ బై చెప్పేస్తానని సవాల్ విసిరారు.. ఇదే సమయంలో అవినీతి రుజువైతే రాజకీయ సన్యాసం చేసే దమ్ము ఎమ్మెల్యేకి ఉందా? అంటూ సవాల్ చేశారు. తాను నిరూపించలేకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాతపూర్వకంగా కలెక్టర్కు ఇస్తానన్నారు.
అవినీతికి పాల్పడలేదనే ధైర్యం ఉంటే రాజీనామా పత్రం తీసుకుని కలెక్టర్ ముందుకు వచ్చే ధైర్యం ఎమ్మెల్యేకి ఉందా? అని ఛాలెంజ్ చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న అఖిలను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండాలనే లక్ష్యంతో ఆమె వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు ప్రతివిమర్శలు చేయడం గమనార్హం.