గడిచిన పది రోజులుగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న పెద్ద నోట్ల రద్దు సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. చిల్లర దొరకక సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే.. పెద్ద నోట్ల హడావుడితో అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. ఇదిలావుంటే, ఈ నోట్ల రద్దు పై రాత్రి ఎనిమిది తర్వాత సడెన్గా వెల్లడించిన ప్రధాని మోడీ.. ఇలాంటి నిర్ణయాలను అకస్మాత్తుగా(సడెన్గా) వెల్లడించడం, అత్యంత రహస్యంగా ఉంచడమనే రెండు సూత్రాల ఆధారంగా పని చేశామని, అందుకే ఇప్పుడు ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన చెబుతూ.. మోడీ దేశ జనాలకి షాక్ ఇచ్చారు. అప్పటి వరకు అందరూ నిజమే అనుకున్నారు. ఇది సడెన్ డెసిషనే అని సరిపెట్టుకున్నారు.
కానీ, రానురాను ఈ సడెన్ డెసిషన్పై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిపై అనేక సందేహాలు వస్తున్నాయని వైకాపా అధికార ప్రతినిధి సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ నిన్న పెద్ద బాంబు పేల్చారు. ఈ నోట్ల రద్దు విషయం చంద్రబాబు అండ్ కోకి ముందుగానే తెలుసునని, అందుకే వాళ్లు సంచులు సర్దేశారని పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. గతంలో బాబు వైఖరిని గమనిస్తే..బొత్స వ్యాఖ్యలు నిజమేననే సందేహం కలుగక మానదు. మోడీ ప్రకటనకు ఖచ్చితంగా నెల రోజుల ముందు నుంచి దేశంలో వెయ్యి రూపాయల నోటు ఎందుకు ? అంటూ చంద్రబాబు తన ప్రసంగాలను స్టార్ట్ చేసిన సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి.
అంతేకాదు, వెయ్యి నోట్ల వల్లే నల్ల ధనం పోగుపడుతోందని బాబు విశాఖ సహా విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లలో చెప్పారు. ఈ వెయ్యి నోట్లను రద్దు చేయాలని కోరుతూ తాను కేంద్రంలోని మోడీ సర్కారుకి లేఖ రాస్తానని చెప్పారు. అయితే, అప్పట్లో ఇదంతా బాబు రొటీన్ చర్యల్లో భాగమనే అందరూ అనుకున్నారు. కానీ, నిన్న బొత్స పేల్చిన బాంబును పరిశీలిస్తే.. మోడీ ప్రకటనకన్నా ముందే బాబుకు ఈ పెద్ద నోట్ల రద్దుపై లీకులు అందాయని స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన తన హెరిటేజ్ను అమ్ముకున్నారని బొత్స చెబుతున్నదాంట్లోనూ వాస్తవం లేకపోలేదని అనిపిస్తోంది.
లేకపోతే, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్న తరుణంలో ఇప్పుడు మాత్రమే బాబు పెద్ద నోట్లపై ఎందుకు లేఖ రాయాలి? వాటి వల్లే నల్లధనం పోగవుతోందని ఎందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలోకేంద్రంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న చంద్రబాబుకు ఈ విషయంపై ముందే లీకులు అందాయని భావించాల్సి వస్తోంది. ఇక, బాబు కేబినెట్లోని మరో మంత్రి కూడా ఖచ్చితంగా ఈ పెద్ద నోట్ల రద్దుకు కొన్ని వారాల ముందే తన వ్యాపార భాగస్వాములను ఇంటికి పిలిచి వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని పెద్ద నోట్ల తో సర్దు బాటు చేశారని, తీరా రెండువారాలు గడిచాక ఆ నోట్లు ఎందుకూ పనికిరాకుండా పోయాయని ఓ వార్త వచ్చింది. అంటే, ఈ మంత్రి గారు తనను తాను సేఫ్ చేసుకోవడం కోసం తన భాగస్వాములకు పెద్ద నోట్లు ముట్టజెప్పారని తెలుస్తోంది. సో.. ఇలా.. పెద్ద నోట్ల రద్దు విషయం బాబు అండ్కో కి ముందుగానే తెలుసనేందుకు ఈ ఎవిడెన్స్ చాలవా?!!