నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయా డైరెక్షన్లో సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను డివీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై దానయ్య ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్స్, గ్లింప్స్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పాయి.
కాగా ఈ సినిమా ఆగస్టు 29 గ్రాండ్ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత నాని స్టార్ డైరెక్టర్ సుజిత్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బడ్జెట్ కారణాలవల్ల ఈ సినిమా హోల్డ్ లో పడింది. ఈ నేపథ్యంలో నాని.. తనకు దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మరోసారి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా దసరా మూవీ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో దసరా మూవీ హీరోయిన్ కీర్తి సురేష్ మరోసారి ఈ సినిమాలో కూడా హీరోయిన్గా నటించబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే కీర్తి సురేష్ తో పాటే.. సాయి పల్లవి పేరు కూడా మేకర్స్ దృష్టిలో ఉందని తెలుస్తుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని టాక్.