టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డ్ ను కేంద్రం ప్రకటించింది. ఇక దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరితో పాటు చిరంజీవి సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం కీలక ప్రకటన చేశారు.
‘తెలుగు చిత్ర పరిశ్రమలో శిఖర సమానులు అన్నయ్య చిరంజీవి గారికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ – 2022 పురస్కారం రావటం ఎంతో ఆనందంగా ఉంది’. ‘గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం’.
‘ఈ సంతోష సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి నా హృదయపూర్వక అభినందనలు.. నాలుగు దశబ్దాల పైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం తనని తాను మలుచుకుని తనని తాను చెక్కుకున్న ఓ శిల్పంలా ప్రజల హృదయాలలో ఎంతో గొప్ప స్థానం సంపాదించుకోవడం.. అది నాతో సహా ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం. చిరంజీవి గారికి చలన చిత్ర వేదికపై ఈ గౌరవం దక్కుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.