టికెట్ రేట్ల విషయంలో టాలీవుడ్కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య గత కొద్ది రోజులుగా నడుస్తున్న కోల్డ్ వార్ కాస్త.. ఇప్పుడు హాట్ వార్గా మారుతోంది. ముఖ్యంగా ఇటీవల న్యాచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెర లేపాయి. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉందని.. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందంటూ నాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
దీంతో నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. టాలీవుడ్ సినిమాల పై, హీరోల రెమ్యూనరేషన్స్పై వరుస కౌంటర్లు వేశారు. ఇక తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా సైతం ఈ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
సీఎం జగన్ ఏం చేసినా పేదలకు మంచి జరిగేలానే చూస్తారు. పెద్ద సినిమాల గురించి ఆలోచిస్తున్నారే కానీ చిన్న సినిమాల గురించి ఆలోచించడం లేదు అంటూ రోజా ఫైర్ అయ్యారు. అలాగే నాని సినిమా థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగా ఉందన్నప్పుడు ఆయన సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా వ్యాపారమే చేసుకోవచ్చు అంటూ రోజా చురకలు వేశారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమే అవుతుంది.. తద్వారా సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశముంది అంటూ రోజా హెచ్చరించారు. చివరిగా ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ అన్ని విషయాలను పరిష్కరిస్తుందని రోజా పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు రోజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.