మెగా డాటర్, నటి, నిర్మాత నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నటిగా పలు సినిమాలు, వెబ్ సిరీస్లలో నటించిన ఈ భామ.. చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడిన తర్వాత నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న `ఆలీతో సరదాగా` ప్రోగ్రాంలో పాల్గొన్న నిహారిక వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది.
ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో తనను పంది అని పిలుస్తాడని చెప్పుకొచ్చిందామె. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు నిహారిక అన్న, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తనను తన తండ్రి నాగబాబు.. ‘మమ్మీ’ అని పిలుస్తారని, అదే అన్నయ్య వరుణ్ తేజ్ అయితే చాలా డిఫరెంట్ అని, మామూలుగా నిహా అని, బాగా ముద్దొస్తే బంగారం అని, ఇంకా బాగా ముద్దొస్తే పంది అని పిలుస్తారని చెబుతూ తెగ నవ్వేసింది నిహారిక.
ఇక చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ ఇష్టం..? అని ఆలీ ప్రశ్నించగా.. వెంటనే నిహారిక నాన్న లేకుంటే చచ్చిపోతా అంటూ నాగబాబు అంటేనే తనకు చాలా చాలా ఇష్టమని చెప్పేసింది. ఇంకా మరెన్నో విషయాలను నిహారిక ఈ షోలో షేర్ చేసుకుంది. అవేంటో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.