ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమాపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఉమా తన వదిన (మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ భార్య)ను చంపేశాడని కృష్ణా జిల్లా జనాలు ఇప్పటకీ అనుకుంటారని వైసీపీ నేత జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఉమాను రమేశ్ ఉత్త మాటలు చెప్పే పిట్టల దొరగా కూడా అభివర్ణించారు.
జోగి రమేశ్ గత ఎన్నికల్లో మైలవరం నుంచి ఉమా మీద పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఉమా గురించి మాట్లాడిన రమేశ్ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమా ఇరిగేషన్ మినిస్టరే కాదని, ఆయన ఓ బ్రోకర్ అని కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉమా బ్రోకర్గా మారి అటు చంద్రబాబుకు, ఇటు చినబాబుకు డబ్బులు ఇస్తున్నారని కూడా రమేశ్ ఆరోపించారు. మైలవరానికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని మంత్రి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇక పదే పదే వైసీపీ అధినేత జగన్పై విమర్శలు చేస్తోన్న ఉమాకు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేదని రమేశ్ ఫైరైయ్యారు. జగన్ చంద్రబాబులా వెన్నుపోటు రాజకీయాలు చేసి సీఎం కాలేదని కూడా ఎద్దేవా చేశారు. ఇక పోలవరం సాధించింది, జగన్ తండ్రి వైఎస్ అన్న రమేశ్..పోలవరంపై తాను ఉమాతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఉమా ప్లేస్, టైం చెపితే తాను ఎప్పుడైనా, ఎక్కడికి అయినా వచ్చి మాట్లాడతానని రమేశ్ చెప్పారు.
ఏదేమైనా ఉమాపై రమేశ్ ఈ స్థాయిలో ధ్వజమెత్తడం సంచలనంగా మారింది. దీనిపై టీడీపీ వర్గాలతో పాటు ఉమా అనుచరులు, ఉమా ఎలా స్పందిస్తారో చూడాలి.