ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందడంతో అక్కడ ఐదారు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. నంద్యాల ఉప ఎన్నిక ప్రస్తావన అప్పుడే ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు వస్తోంది. దీనిపై విపక్ష వైసీపీ అధినేత జగన్ ముందుగానే డెసిషన్ తీసేసుకున్నారు. నంద్యాల సీటు తమదే అని…అక్కడ నుంచి వైసీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటించడంతో నంద్యాలలో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే చంద్రబాబు ఇక్కడి నుంచి భూమా ఫ్యామిలీలో ఎవరో ఒకరిని దింపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నంద్యాల నుంచి టీడీపీ తరపున భూమా చిన్నకుమార్తె భూమా మౌనిక లేదా భూమ అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డిలలో ఎవరో ఒకరు రంగంలో ఉంటారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం భూమా ఫ్యామిలీ నుంచి అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆమెకు మంత్రి పదవి ఇచ్చి, నంద్యాల ఎమ్మెల్యే సీటును బ్రహ్మానందరెడ్డికి లేదా శిల్పా బ్రదర్స్కు ఇచ్చే కండీషన్ కూడా టీడీపీ వర్గాల నుంచి భూమా ఫ్యామిలీకి రావచ్చన్న టాక్ కర్నూలు పాలిటిక్స్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే భూమా అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి ఎప్పటి నుంచో ఎమ్మెల్యే సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో శోభ మృతిచెందినప్పుడు ఆయన ఆళ్లగడ్డ సీటు ఆశించారు. ఈ సారి నంద్యాల సీటు కోరుతున్నారు. నంద్యాల సీటు బ్రహ్మానందరెడ్డికి దక్కని పక్షంలో ఆయనకు వైసీపీ సీటు ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
బ్రహ్మానందరెడ్డికి సీటు ఇస్తే భూమా ఫ్యామిలీ మీద ఉన్న సానుభూతి ఇటు కూడా వర్క్ అవుట్ అవుతుందని…దీని వల్ల వైసీపీ నంద్యాలలో గట్టి పోటీ ఇస్తుందని…ఒకవేళ ఇక్కడ ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో కూడా బ్రహ్మానందరెడ్డికే సీటు ఇస్తే అప్పుడు కూడా బ్రహ్మానందరెడ్డికే ప్లస్ అవుతుందన్నదే జగన్ ప్లాన్గా తెలుస్తోంది. బ్రహ్మానందరెడ్డి ఎవరో కాదు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి స్వయానా అల్లుడు. దీంతో బ్రహ్మానందరెడ్డిని తన వైపునకు లాక్కుంటే భూమా ఫ్యామిలీలో చీలిక రావడంతో పాటు నంద్యాలలో జగన్ పార్టీ మళ్లీ స్ట్రాంగ్ అయ్యే సూచనలు ఉంటాయి.