శ్రీదేవి భజన..బాబు సీటు ఇస్తారా?

ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేతలకు భజన చేసే నేతలకు కొదవ ఉండదనే చెప్పాలి. అలాంటి భజన చేయడంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తిరుగులేదనే చెప్పాలి. మొన్నటివరకు వైసీపీలో ఉన్న ఈమె..జగన్‌కు ఏ స్థాయిలో భజన చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఆరోగ్య శ్రీతో గుండె ఆపరేషన్ చేయించుకున్న గుండె..జగన్ జగన్ అని కొట్టుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా భజన చేశారు. అయితే ఈమె ఎమ్మెల్యేగా పూర్తిగా ఫెయిల్ అయ్యారు.

తాడికొండ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో లేరు. పైగా అమరావతి ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఈ క్రమంలో ఆమెకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని సర్వేల్లో తేలింది. దీంతో ఆమెకు సీటు ఇవ్వకూడదని జగన్ ఫిక్స్ అయ్యారు. కానీ వేరే విధంగా న్యాయం చేసేవారు. కానీ ఈ లోపు శ్రీదేవి..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారు. దీంతో వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు.

ఇక కొన్ని నెలల పాటు ఈమె ఏపీలో కనిపించలేదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత బయటకొచ్చారు. ఇటీవల శ్రీకాకుళం పర్యటనలో ఉన్న చంద్రబాబుని కలిసొచ్చారు. తాజాగా లోకేష్ పాదయాత్ర అమరావతిలో ప్రవేశించింది.  ఈ క్రమంలో శ్రేదేవి..లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. సభలో ప్రసంగిస్తూ..ఆద్యంతం చంద్రబాబు, చినబాబులకు భజన చేస్తూనే కనిపించారు. అలాగే వైసీపీ అమరావతిని ముంచేసిందని, తాను కూడా తప్పు చేశానని క్షమించాలని కోరారు. మళ్ళీ చంద్రబాబుని గెలిపిస్తే దేవతల రాజధాని మించేలా అమరావతిని నిర్మిస్తారని చెప్పుకొచ్చారు.

తన ప్రాణం పోయినా అమరావతి సాధించే వరకు సమిధనై అమరావతి రైతులతో కలిసి పోరాడతానని చెప్పుకొచ్చారు. మొత్తానికి టి‌డి‌పిలోకి వస్తున్న ఆమె..భజన స్పీచ్ బాగానే ఇచ్చారు. కానీ టి‌డి‌పిలో ఆమెకు సీటు గ్యారెంటీ లేదు. తాడికొండలో టి‌డి‌పి ఇంచార్జ్ తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. దీంతో ఆమెకు సీటు దక్కడం కష్టమే. మరి బాపట్ల ఎంపీ సీటు ఏమైనా సెట్ చేస్తారేమో చూడాలి.