న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏ సినిమాకు అంత త్వరగా ఒప్పుకోదు. పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తుంది. హీరోతో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్, స్కిన్ షో వంటివి అస్సలు చెయ్యనని ముందే చెప్పేస్తుంది. అయినాకూడా ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శకనిర్మాతలు తెగ ఆరాటపడుతుంటారు. ఎందుకంటే, సాయి పల్లవి క్రేజ్ అలాంటిది. అయితే సాయి పల్లవి ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకుంది.
అందులో బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్గా నిలిచిన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే మీకు తెలుసా.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో కూడా ఓ బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. `విరూపాక్ష`. సుకుమార్ అందించిన కథ కార్తీక్ వర్మ దండు ఈ మూవీని తెరకెక్కించారు. ఈ హర్రర్ థ్రిల్లర్ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త పాత్ర ఎంతలా హైలెట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే విరూపాక్షలో హీరోయిన్ రోల్ కోసం మొదట సాయి పల్లవిని అనుకున్నారట. సాయి పల్లవి కూడా ఇలాంటి రోల్స్ కు అస్సలు నో చెప్పదు. ఈ నేపథ్యంలోనే ఆమెతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించుకున్నారట. కానీ, సుకుమార్ అడ్డు చెప్పారట. సాయి ధరమ్ తేజ్ తో పోలిస్తే సాయి పల్లవి క్రేజే ఎక్కువ. పైగా విరూపాక్షలో అధిక ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ పాత్రను సాయి పల్లవి పోషిస్తే.. ఆమె తేజ్ ను ఖచ్చితంగా డామినేట్ చేసేస్తుందని సుకుమార్ చెప్పాడట. దాంతో దర్శకుడు మనసు మార్చుకుని సంయుక్తను హీరోయిన్ గా ఫైనల్ చేశాడట. అలా సాయి ధరమ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో విరూపాక్ష మూవీ మిస్ అయింది.