స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సలార్`. ప్రభాస్ కెరీర్లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఇది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, టినా ఆనంద్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయి. రీసెంట్ గా బయటకు సలార్ టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా సలార్ పార్ట్ 1 ఓటీటీ రైట్స్ ను మేకర్స్ విక్రయించారట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. డిజిటల్ రైట్స్ రూపంలోనే సగం బడ్జెట్ రికవరీ అయిపోయిందని అంటున్నారు. సలార్ ఓటీటీ డీలః కళ్లు చెదిరే ధరకు క్లోజ్ అయింది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ సలార్ ఓటీటీ రైట్స్ను పోటీ పడి మరీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ తో పాటు హిందీ భాషకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ను దాదాపు రూ. 200 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ గత చిత్రాలు రాధేశ్యామ్, అదిపురుష్ ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా సరే సలార్ కు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం మామూలు విషయం కాదనే చెప్పాలి.