ఆ క్ష‌ణం సిగ్గుతో చ‌చ్చిపోయా.. సినిమాలు చేయ‌న‌న్నా: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్న చిరంజీవికి మించిన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల నట‌సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో పాల్గొన్నాడు.

తాజాగా ప‌వ‌న్ ఎపిసోడ్ పార్ట్ 1 ను ఆహా టీమ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే ఈ టాక్ షోలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అనుభవాల‌ను పంచుకున్నాడు. అస‌లేమైందంటే.. `నీకు చాలా సిగ్గు ఎక్కువ కదా. లైఫ్ లో బాగా ఇబ్బందిపడ్డ సందర్భం. అసలు నా వల్ల కాదు అనుకున్న సందర్భం ఏమైనా ఉందా..?` అని బాల‌య్య ప్ర‌శ్నించాడు.

అందుకు పవన్ కళ్యాణ్ బ‌దులిస్తూ.. `సుస్వాగతం సినిమా టైమ్ లో వైజాగ్ జగదాంబ సెంటర్ లో బస్సు పై నించొని డ్యాన్స్ వేయమన్నారు. చుట్టూ జనాలు ఉన్నారు. లారెన్స్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్. నాకు మామూలుగానే సిగ్గు ఎక్కువ‌. ఇక చుట్టూ జ‌నాలు ఉండేస‌రికి ఆ క్ష‌ణం సిగ్గు చచ్చిపోయా. వదినకి కాల్ చేసి నా వల్ల కాదు, వీళ్ళు ఏమేమో చేయిస్తున్నారు. ఇదే నా లాస్ట్ సినిమా, ఇంకా సినిమాలు చేయను` అంటూ ఆనాటి రోజుల‌ను గుర్తు చేసుకున్నారు.