ఆ హీరోపై ఉన్న మోజుతోనే అది చేశా.. ప‌చ్చిగా మాట్లాడేసిన ర‌ష్మిక‌!

నేషనల్ క్రష రష్మిక మందన్నా ఈ సంక్రాంతికి `వ‌రిసు(తెలుగులో వారసుడు)` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో, 13న హిందీలో, 14న తెలుగులో విడుదలైంది.

అయితే తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించినా.. మిగిలిన చోట్ల ఊహించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక పాత్ర పై చాలా విమర్శలు వచ్చాయి. రష్మిక పాత్ర‌కు ఈ మూవీలో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం రెండు పాటలు కు మాత్రమే ఆమెను పరిమితం చేశారు. ఈ విషయంలో రష్మిక అభిమానుల సైతం పెదవి విరిచారు. అయితే తాజాగా ఇదే విషయంపై రష్మిక స్పందించింది.

విజ‌య్ ద‌ళ‌ప‌తి పై ఉన్న మోజులోనే ఈ సినిమా చేశానంటూ ర‌ష్మిక ఓపెన్‌గానే చెప్పేసింది. `వార‌సుడులో నా పాత్ర‌కు ఎలాంటి ప్రాధాన్యం లేద‌ని, కేవ‌లం రెండు పాట‌లు మాత్ర‌మే ఉన్నాయ‌ని నాకు తెలుసు. అయినాస‌రే నేను నా ఇష్ట‌ప్ర‌కార‌మే ఈ సినిమాకు సైన్ చేసింది. ఎందుకంటే, విజ‌య్ సార్ అంటే నాకెంతో ఇష్టం. ఆయ‌నతో స్క్రీన్ షేర్ చేసుకోవాల‌న్న ఒక్క‌ కార‌ణంతోనే ఈ సినిమా చేశాను. సినిమాలో నేను చేయ‌డానికి పాట‌లు త‌ప్ప ఏమీ లేదని విజ‌య్ సార్ తో కూడా షూటింగ్ టైంలో జోక్ చేశాను` అంటూ ర‌ష్మిక తాజా ఇంట‌ర్వ్యూలో ప‌చ్చిగా నిజాలు మాట్లాడేసింది.