టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ `లైగర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్లు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు.
భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఆగస్ట్ 25వ తేదీనే `అర్జున్ రెడ్డి` చిత్రం విడుదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంమే విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ హీరో చేసింది.
అర్జున్ రెడ్డికి ముందు అడపా తడపా సినిమాలు చేస్తూ రాణిస్తున్న విజయ్కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ తారలు సైతం విజయ్కు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి విడుదలైన తేదీనే లైగర్ చిత్రం కూడా రిలీజ్ కాబోతోంది. మరి ఆ సినిమా సెంటిమెంట్ను లైగర్ రిపీట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిస్తే.. విజయ్ దేవరకొండ ఈ సారి ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్గా మారిపోతాడు.
అంతే కాదు, ఈయన బాహుబలి తర్వాత దేవవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ను మించిపోయినా ఆశ్చర్య పడాల్సిన పని లేదు. కాగా, రూ. 125 కోట్ల భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతికతతో లైగర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.