సారు.. వచ్చేశారు సిటీకి

నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధానికి వచ్చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి విమానంలో సిటీలో ల్యాండ్ అయ్యారు. వరి సమస్యపై మోదీతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తామని ప్రజలకు చెప్పి తన టీమ్ తో హస్తినకు వెళ్లిన కేసీఆర్ కు అక్కడ ఎవరి దర్శనమూ కాలేదు. ఎంత ప్రయత్నించినా మోదీని కలిసే అవకాశం రాలేదు. దీంతో అక్కడే ఉండి చేసేది లేక తిరిగొచ్చేశారు. విచిత్రమేమంటే నాలుగు రోజుల పాటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిని కలవడానికి ప్రయత్నిస్తే పీఎం పేషీ అసలు పట్టించుకునే లేదు. మన దేశంలో ఒక ముఖ్యమంత్రి.. దేశ ప్రధానిని కలవడానికి ఇంత ఇబ్బందులు పడాలా అని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు.

రాష్ట్రంలో వరి కొనుగోలు సమస్య తీవ్రంగా ఉంది.. కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. కానీ అలా జరగడం లేదు.. మోదీ పట్టించుకోవడం లేదు.. రైతుల ప్రాణాలు పోతున్నాయి.. ఏదో ఒక విషయం చెబితే మేము ప్రత్యామ్నాయం చూపిస్తాం కదా అని ఢిల్లీ దాకా వెళ్లిన సీఎంకు నిరాశే ఎదురైంది. చర్చలు కాదు కదా.. కనీసం కలిసేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. ఇక్కడ మరో సమస్య ఉంది.. కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయాలని అనుకుంటే ఎప్పుడో కొనుగోలు చేసేది.. ఇంతవరకు నాన్చిందంటే ఇక కొనుగోలు చేయదు అని రాజకీయాలు తెలిసిన ఎవ్వరికైనా అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ను మోదీ కలిసి.. ఈయన మాటలు విని హామీ ఇస్తే ఇక్కడ బీజేపీ నాయకులు అసంత్రుప్తికి గురవుతారు. మేము ఇక్కడ కారు పార్టీతో ఇంత పోరాడుతుంటే మీరేమో కేసీఆర్ ఏది అడిగితే అది ఇచ్చేస్తారు.. మేము వాళ్లతో కొట్లాడి ప్రయోజనమేమని హైకమాండును నిలదీస్తారు. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు మోదీ బిజీ..బిజీ అని కేసీఆర్ కు సమాధానం చెప్పినట్లు తెలిసింది.