టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ తర్వాత భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్లతో కలిసి వెకేషన్ కోసం విదేశాలు చెక్కేశారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లారన్నది సస్పెన్స్ గా మారగా.. ఈ విషయంపై ఆయన తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ పారిస్లో సందడి చేస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ కొడుకుతో దిగిన ఓ నయా పిక్ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈఫిల్ టవర్ బ్యాక్డ్రాప్లో పెద్ద తనయుడు అభయ్రామ్ను ఎత్తుకుని ముద్దాడుతూ ఎన్టీఆర్ అందులో కనిపించారు. అలాగే ఈ ఫొటోలో అభయ్రామ్ క్యూట్ ఎక్స్ప్రెషన్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దాంతో వీరిద్దరి పిక్ నెట్టింట వైరల్గా మారింది.
కాగా, ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే ఈయన రామ్ చరణ్తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది.
ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఎన్టీఆర్ వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్పై సైతం ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.