ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విలన్గా కనిపించనున్నారు.
అలాగే ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో కనిపించనుండగా.. రష్మిక శ్రీవల్లిగా నటిస్తోంది. ఇక మొన్నీ మధ్య ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ `దాక్కో దాక్కో మేక..` సూపర్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు..ఎన్నో రికార్డులను సైతం నెలకొల్పింది. అయితే తాజాగా మేకర్స్ సెకెండ్ సింగిల్ సాంగ్ను కూడా వదిలారు.
‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే..’ అంటూ సాగే ఈ పాట అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ ఆలపించగా.. హిందీలో జావేద్ అలి పాడారు. చంద్రబోస్ పాటకు సాహిత్యం అందించగా..దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మొత్తానికి అదిరిపోయిన శ్రీవల్లి పాట ప్రస్తుతం వైరల్గా మారింది.