డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. స్వయంవరం తో రైటర్ గా మారిన త్రివిక్రమ్.. మొదటిసినిమా నుంచే తన పెన్ పవర్ ఏంటో అందరికీ రుచి చూపించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, చేస్తున్న ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అగ్ర దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు.
తనదైన మాటల మాయాజాలంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్న ఈ మాంత్రికుడు.. కెరీర్ స్టార్టింగ్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇంటస్ట్రీలో నిలదొక్కుకునేందుకు నానా కష్టాలు పడ్డాడు. అవన్నీ కమెడియన్ కమ్ హీరో సునీల్కి బాగా తెలుసు. ఎందుకంటే, సునీల్ త్రివిక్రమ్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ పంజాగుట్టలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని సినిమా ప్రయాణం సాగించారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్గా ఎదిగితే, సునీల్ కమెడీయన్ నుండి హీరో స్థాయికి ఎదిగాడు.
అయితే ప్రస్తుతం ఎన్నో భోగాలు అనుభవిస్తున్న త్రివిక్రమ్.. అప్పట్లో తాను ఉన్న ఇంటిని మాత్రం వదిలి పెట్టలేకపోయాడట. ఎంత ప్రయత్నించినా ఆ ఇంటితో ఏర్పడిన బాండింగ్ను కట్ చేసుకోలేకపోయిన త్రివిక్రమ్..ఇప్పటికీ ప్రతినెల ఆ ఇంటికి రూ.5 వేలు అద్దె పంపుతున్నారట. అంతేకాదు, ఆ ఇంట్లో కూర్చునే తన సినిమాలకు కథలు, మాటలు రాస్తున్నారట. ఈ ఇంటిలో కూర్చుంటే కథలు రాయడం ఎంతో సులభంగా ఉంటుందని త్రివిక్రమ్ భావిస్తారట. అందుకే ఆ ఇంటికి అద్దె చెల్లిస్తూ.. అక్కడే ఇప్పటికీ కథలు రాసుకుంటారట.