ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం టీడీపీ ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు గురువారం నాడు బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ఆ కారణంగానే ఆయన టీడీపీకి రాజీనామా చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, ఇప్పటి వరకు బుచ్చయ్య ఆరు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన సమయంలో ఆయన ఎన్టీఆర్ తో పాటే ఉన్నారు. ఇక 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడినా.. ఆయన మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీ తరపున వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు.