సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ చిన్న విషయంలో తేడా వచ్చినా.. వారి వారి అభిమానులు ఏకిపారేస్తారు. సంయమనంగా ఉండే ఫ్యాన్స్ విడిపోతుంటారు కూడా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమా నుంచి తొలి పాట విడుదల చేసిన సంగతి తెలిసిందే. `దోస్తీ..` అంటూ సాగిన ఈ సాంగ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
అలాగే ఈ సాంగ్ చివర్లో ఎన్టీఆర్, చరణ్ లు కూడా వచ్చి సందడి చేయడంతో.. అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ రాహుల్ వర్మ .. కేవలం చరణ్పైనే పొగడ్తల వర్షం కురిపించారు. `ఆ మీసకట్టు, కళ్లలో పౌరుషం చూస్తుంటే మగధీరను మించిపోయేలా ఉంటుందనిపిస్తోంది` అని కామెంట్ చేశారు.
దాంతో బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ చరణ్ ను మెచ్చుకున్నారహో అంటూ ఏకంగా ప్రెస్ నోట్ రిలీజైంది. ఇంకేముంది.. అసలు రచ్చ మొదలైంది. రామ్ చరణ్ను మాత్రమే మెచ్చుకున్నారని ప్రెస్ నోట్ రావడంతో.. ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా హట్ అయ్యారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా.. అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. దోస్తీ సాంగ్ లో చరణ్ బాగున్నాడు అంటే.. ఎన్టీఆర్ బాగోలేదని అర్థమా..? లేక కావాలనే చరణ్ను హైలైట్ చేస్తున్నారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ముందు ముందు ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.