ఏపీ అధికార పార్టీ టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలే వీరిలో పెద్ద ఎత్తున ఆందోళనకు కారణం అయ్యాయట! వాస్తవానికి తాజాగా నిర్వహించిన సర్వేలో టీడీపీ పాలన, చంద్రబాబు నాయకత్వం తదితర అంశాల్లో అన్నీ ప్లస్సులో వచ్చాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్యమం రేగిన కాపు సామాజిక వర్గంలోనూ టీడీపీకి సానుకూల వాతావరణం ఉందని రిపోర్ట్ వచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున సంబరం చేసుకుంటారని అందరూ భావిస్తారు.
అయితే, ఇలాంటి సంబరాలు చేసుకునే వాతావరణం ఇప్పుడు కూడా తమకు లేదని టీడీపీ తమ్ముళ్లు వాపోతున్నారు. దీనికి తమ అధినేతే కారణమని వారు చెబుతుండడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న పరిణామం. ఈ క్రమంలో తమ పరిస్థితిని సర్వేకి ముందు, సర్వే తర్వాత అన్నట్టుగా పరిశీలించుకుంటున్నారట. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబు.. మామూలుగానే పార్టీపైనా పార్టీ నేతలపైనా పెద్ద ఎత్తున పైచేయిలోనే ఉంటారు. అంతా నాయిష్టం – అనే టైపులోనే ఏదైనా ఆయన డిసైడ్ చేస్తారు. ఏ విషయంలోనైనా సూచనలు వింటారే తప్ప ఫైనల్ డెసిషన్లు అన్నీ తానే తీసుకుంటారు.
దీంతో తమ మాటలకు విలువ లేదని, తాము చెప్పది అధినేత పట్టించుకోడని టీడీపీలో ఇప్పటికే నేతలు వాపోతున్నారు. ఇక, ఇప్పుడు తాజా సర్వేతో చంద్రబాబుకు తిరుగులేదని రిజల్ట్ వచ్చిన క్రమంలో ఇక నుంచి అసలు తమను బాబు అస్సలు పట్టించుకునే ఛాన్స్ కూడా లేకుండా పోతోందని వాళ్లు వాపోతున్నారట. ఇప్పటి వరకు కనీసం వివిధ అంశాలపై సూచనలైనా కోరిన బాబు.. ఇక నుంచి తమను ఎట్టి పరిస్తితిలోనూ పట్టించుకునే ఛాన్స్ కూడా ఉండదని వారు తమలో తామే ఆందోళన చెందుతున్నారట. దీంతోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అంటూ.. బాబు అనుకూల మీడియాలో వచ్చిన కథనం తమలో ఆనందం నింపలేదని వాళ్లు చెప్పుకోవడం గమనార్హం. మరి ఈ వార్తలు ఏ నిఘా ద్వారానైనా చంద్రబాబు చెవిలో పడతాయో లేదో చూడాలి.