ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో నిర్వహిస్తున్న సమీక్షలు ఒక్కొక్కసారి పిచ్చ కామెడీ పుట్టిస్తున్నాయి. తనకు సంబంధం లేని విషయం, తన పరిధిలో లేని అధికారులపైనా చంద్రబాబు అజమాయిషీ చేయాలని చూడడం ఈ రివ్యూలలో అధికారులకు కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుండడం గమనార్హం.
గతంలో పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో రాష్ట్ర అధికారులకు క్లాస్ పీకారు చంద్రబాబు. ఈ నిధులు ఇవ్వాల్సింది కేంద్రం. ఈ నేపథ్యంలో కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ఈ విషయాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు.. పోలవరం నిధులు సక్రమంగా తెప్పించడంలో జల వనరుల ఇంజనీర్లు విఫలం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, రెండు రోజుల తర్వాత ఆయనే ఢిల్లీ వెళ్లి.. జల వనరుల మంత్రి ఉమా భారతిని కలిసి.. చర్చించారు. ఇక, ఆ తర్వాత కూడా గోదావరి జిల్లాలను ఏపీకి రప్పించడంపై తెలంగాణతో ఇప్పందాలు చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదే. అయితే, దీనిపైనా ఆయన రాష్ట్ర అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఇలా అనేక సందర్భాల్లో బాబు తన సమీక్షల్లో ఇలాంటి కామెంట్లే చేయడం, ఆ తర్వాత అధికారులు సార్.. ఇది మా పరిధిలో లేదు. మీరు తేల్చాలని చెప్పగానే నాలుక కరుచుకోవడం సాధారణంగా మారింది.
ఇప్పుడు తాజాగా.. పెద్ద నోట్ల రద్దు.. కొత్త నోట్ల కొరతపై స్పందించిన చంద్రబాబు ఈ తప్పు మొత్తాన్ని బ్యాంకర్లపై నెడుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఆయన బ్యాంకర్లపై ఫైరైపోతున్నారు. సమీక్షలతో వారి బుర్రతినేస్తున్నారు. పెద్ద నోట్లను ప్రజలు పెద్ద ఎత్తున వాపస్ చేస్తున్నా.. మీరు ప్రజలకు నోట్లను ఇవ్వడంలో పూర్తిగా విఫలమవుతున్నారు అంటూ చిర్రుబుర్రులాడారు. ఇలాగైతే సహించేది లేదని తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు.
వాస్తవానికి బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండరు. కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ పరిధిలో పనిచేస్తారు. కానీ, చంద్రబాబు మాత్రం బ్యాంకర్లను తన కింద పనిచేసే ఉద్యోగులు అనుకున్నారో ఏమో.. పెద్ద ఎత్తున వార్నింగ్లు ఇచ్చారు. దీంతో ప్రభుత్వ అధికారులే పెద్ద ఎత్తున నవ్వుకున్నారని సమాచారం.