రాజకీయాల్లో అధికారమే పరమావధిగా వ్యూహాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. దీనికి ఎవ్వరూ అతీతులు కారు! ప్రస్తుతం ఇలాంటి ఓ పెద్ద వ్యూహంలోనే ఉన్నారట తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత. ప్రస్తుతం ఆమె నిజామాబాద్ పార్లెమెంటు స్థానం నుంచి ఎంపీగా 2014లో గెలుపొందారు. ఈ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారన్న టాక్ తెచ్చుకున్నారు. అయితే, ఎంపీగా తాను కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైపోయాను అనే ఫీలింగ్ ఆమెలో నెలకొందట! దీంతో తన వ్యూహాన్ని ఆమె అసెంబ్లీ వైపు మళ్లించారు.
వచ్చే 2019 ఎన్నికల్లో పార్లమెంటు మాట పక్కన పెట్టి.. అసెంబ్లీకే జెండా ఎగరేయాలని కవిత నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదైతేనే తనకు మరింత సేవ చేసేందుకు స్కోప్ ఉందని ఆమె తన సన్నిహితులతో అన్నారంట. దీంతో రానున్న ఎన్నికల్లో కవిత… ఖచ్చితంగా అసెంబ్లీ కి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే, దీని వెనుక ఇంకో కారణం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు. వాస్తవానికి 2014లో ఎంపీగా గెలిచిన కవిత.. అనంతర పరిణామాల నేపథ్యంలో టీఆర్ ఎస్ పార్టీ కేంద్రంలోని ఎన్డీఏతో జట్టు కడుతుందని భావించారు.
దీంతో జట్టును అడ్డుపెట్టి.. మంత్రి పదవిని పట్టేయాలని ప్లాన్ వేశారట. అయితే, ఎందుకనో కేసీఆర్ కి… ఎన్డీఏ మిత్రలకు కెమిస్ట్రీ కుదరలేదు. దీంతో టీఆర్ ఎస్ పార్టీ ఎన్డీఏలో చేరలేదు. ఫలితంగా కవిత మంత్రి పదవి కల కలగానే మిగిలిపోయింది. ఇక, దీంతో కవిత ప్లేట్ ఫిరాయించారని తెలుస్తోంది. కేంద్రంలో కన్నా రాష్ట్రంలోనే మంత్రి అయితే బెటర్గా ఉంటుందని భావించారని స్టోరీ! ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి గెలిచి.. స్టేట్ కేబినెట్లో సీటు సంపాయించాలని వ్యూహం పన్నారట కవిత!! మొత్తానికి ఈ వ్యూహమైనా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.