వైకాపా అధినేత జగన్ చుట్టూ మరోసారి ఉచ్చుబిగుసుకుంటోందా? ఇప్పటికి అనేక కేసుల్లో చిక్కుకున్నా.. కేసుల విచారణలో కొంత జాప్యం జరుగుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న ఆయనకు త్వరలోనే భారీషాక్ తగలనుందా? ఏపీ టీడీపీ నేతలు జగన్ను మరింత ఇరకాటంలోకి నెట్టేలా పావులు కదుపుతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు పోగేసుకున్న కేసులో జగన్ దాదాపు ఏడాదికి పైగా జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం జగన్ కేసుల విచారణ హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టులో సాగుతున్నాయి. అయితే, ఏం జరిగిందో ఎందుకో తెలీదుకానీ.. అప్పట్లో.. అంటే కేసులు నమోదైన సమయంలో సాగినంత వేగంగా ఈ కేసుల విచారణ ఇప్పుడు సాగడం లేదు. అంతేకాదు, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నా.. ప్రధాని విపక్ష నేత అనే కారణంతో జగన్కి కోర్టు మినహాయింపు ఇచ్చింది. దీంతో ఈ కేసులతో సంబంధం ఉన్న మాజీ మంత్రులు సహా ఐఏఎస్లు సైతం కోర్టుకు వెళ్తున్నారు.
ఇప్పుడు ఈ వ్యవహారంపైనే టీడీపీ నేతలు దృష్టి పెట్టారు. జగన్ కేసులు ఎందుకు విచారణ త్వరగా సాగడం లేదని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ కేసుల విషయంలో సీబీఐ వ్యవహార శైలిపై వారు కేంద్రానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. కేంద్రంలో ఎలాగూ తమ మిత్ర పక్షం ఎన్డీఏనే ఉందికాబట్టి.. ఒక్క ఆదేశంతో జగన్ కేసులను పరుగులు పెట్టిస్తారని.. దీంతో జగన్ చుట్టూ ఉచ్చుబిగుసుకుని ఇక ప్రతి రోజూ కోర్టుల చుట్టూ తిరగక తప్పదని అంటున్నారు. అయితే, వీరికి ఇంత కసి ఏంటనేగా సందేహం. అక్కడికే వద్దాం..
ఓటుకు నోటు కేసు విషయంలో సీఎం చంద్రబాబు పేరు ప్రముఖంగా ఉండడం తెలిసిందే. అంతేకాదు, ఓ టేపులో ఆయన వాయిస్కూడా నిర్దారణ అయింది. అయినా కూడా తెలంగాణ ఏసీబీ కేసు విచారణను నత్తనడకన సాగిస్తోంది. దీంతో చంద్రబాబుపై విచారణ ఆగిపోయింది. దీనిని పాయింట్గా చేసుకుని బాబును ఇరుకున పెట్టేందుకు మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. హైకోర్టుకు వెళ్లారు. అయితే, వాద ప్రతివాదాల తర్వాత.. బాబుకు ఫేవర్గానే తీర్పు వచ్చింది.
ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఇప్పుడు ఇదే ఫార్ములాను జగన్పై ప్రయోగించాలని భావిస్తున్నారు. అయితే, వారు కోర్టుకు కాకుండా పొలిటికల్గా అడుగులు వేయడం చర్చకు దారితీసింది. ఇదే జరిగితే.. జగన్ ఇరకాటంలో పడడం ఖాయం. ఎందుకంటే.. ఇటీవలే కొత్తగా సీబీఐ డైరెక్టర్గా వచ్చిన రాకేష్ ఆస్తానా.. మోడీకి నమ్మినబంటు. సో.. మోడీ ఒక్క కనుసైగ చేస్తే.. చాలు .. జగన్ కేసు.. రేసు గుర్రంలా పరిగెట్టడం ఖాయం. చూద్దాం ఏం జరుగుతుందో.